హైదరాబాద్: 2025 జూన్ 12న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ (ఫ్లైట్ AI171) విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళుతుండగా, సర్దార్ వల్లభ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది. ఈ విషాద ఘటన నేపథ్యంలో, ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఒక ఫేస్బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, ఇలా రాశారు:
"చాలా దారుణంగా ఉంది నిన్నటి పరిస్థితి ఏయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ సీసీ టీవీ ఫు్టేజ్...ఒక లీటర్ పెట్రోల్మ. నిషిని బూడిద చేస్తుంది.. అలాంటిది 58 వేల లీటర్ల పెట్రోల్వి/ మానం పేలితే మనుషులు ఏలా. అవుతారో మీరే ఊహించుకోవచ్చు. అది కూడా విమాన పెట్రోల్. మన బండ్లలో వాడే పెట్రోల్ కంటే స్వచ్ఛమైంది,పదింతల అగ్నిని కలిగిస్తుంది ...విమాన చరిత్రలో అత్యంత విషాద ఘటనగా ఇది నిలిచిపోతుంది.…"(Archive)
వీడియోలో ఓ పార్కింగ్ లాట్లో జరిగిన బ్లాస్ట్, ఆ తర్వాత ఆస్పత్రి అంతర్భాగంలో కనిపించే దృశ్యాలు ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెక్
న్యూస్మీటర్ పరిశీలనలో ఈ దావా తప్పు అని తేలింది. ఈ వీడియో 2025 ఫిబ్రవరిలోనే ఇంటర్నెట్లో ప్రత్యక్షమైందని గుర్తించాం. అంటే, ఇది జూన్ 12 అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధం లేనిది.
వీడియోను జాగ్రత్తగా పరిశీలించగా, అందులో "Ragheb Harb University Hospital" అనే సోషల్ మీడియా ఐడి పేరు స్పష్టంగా కనిపించింది.
దీనిపై కీవర్డ్ సర్చ్ చేయగా, రాగెబ్ హెర్బ్ యూనివర్సిటీ హాస్పిటల్ అధికారిక ఫేస్బుక్ పేజీలో ఇదే వీడియో 2025 ఫిబ్రవరి 5న అప్లోడ్ చేసినట్టు తెలిసింది — అంటే ప్రమాదం జరిగే దాదాపు నాలుగు నెలల ముందే.
అసలైన వీడియో క్యాప్షన్ (అరబిక్ నుంచి అనువాదం):
"ప్రజల ఆశలను చీల్చేందుకు శత్రు ప్రయత్నించినా, షేఖ్ రఘెబ్ హర్బ్ ఆసుపత్రిలో సేవలందించే దేవదూతల ధైర్యం తిరిగి నిలబెట్టింది. మేము మిమ్మల్ని మా కనురెప్పలతో సేవ చేస్తూనే ఉంటాం."
అంటే, ఈ వీడియో ఓ దాడి తర్వాత జరిగిన మరమ్మతుల దృశ్యాలుగా పేర్కొన్నారు.
అదే సమయంలో, This is Beirut అనే వెబ్సైట్ నవంబర్ 5, 2024న ప్రచురించిన కథనంలో, లెబనాన్లోని టూల్ అనే గ్రామం సమీపంలో ఉన్న ఈ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసినట్టు పేర్కొంది.
అదే విధంగా, 2024 అక్టోబర్ 21న షేర్ చేసిన ఒక X పోస్ట్లోనూ, టూల్ వద్ద ఆసుపత్రి పార్కింగ్ ప్రాంతంలో జరిగిన దాడుల గురించి ప్రస్తావించారు.
అయితే, ఈ వీడియో పూర్తిగా లెబనాన్లోని ఆ ఆసుపత్రిలో తీసినదేనా అన్నది న్యూస్మీటర్ స్వతంత్రంగా నిర్ధారించలేకపోయినప్పటికీ — ఫిబ్రవరి 2025 నుంచే ఇది ఆన్లైన్లో ఉందన్న విషయమే స్పష్టంగా చెప్పగలిగాం. అంచేత ఇది జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదానికి సంబంధించింది కాదని తేలింది.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దృశ్యాలంటూ వైరల్ అవుతున్న వీడియో నిజానికి లెబనాన్లో తీసినదిగా తేలింది. ఇది ప్రమాదానికి నెలల ముందే ఇంటర్నెట్లో కనిపించడంతో, వీడియోకి అహ్మదాబాద్ ఘటనతో ఎలాంటి సంబంధం లేదు. అందుచేత ఈ దావా తప్పు.