Fact Check: ఎన్నికల్లో ఓటమికి ముఖ్యమంత్రి రేవంత్ కారణం అన్న కాంగ్రెస్ ఎంపీ? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి
ఎన్నికల్లో ఓటమికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిందించిన స్వంత పార్టీ నాయకులు అంటూ క్లెయిమ్ చేస్తూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
By - K Sherly Sharon |
Claim:ఎన్నికల్లో రెండు సీట్లు కోల్పోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ కారణం అన్న కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
Fact:వైరల్ క్లెయిమ్ తప్పు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్న వీడియోని కట్ చేసి వైరల్ వీడియోని రూపొందించారు. ఎంపీ సీఎం రేవంత్ను నిందించలేదు.
Hyderabad: భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలి మునిసిపాలిటీ ఎన్నికల్లో ఓటమికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిందించారని చెబుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ పనితీరుపై స్వంత పార్టీ నేతల నుంచే తీవ్ర అసంతృప్తి అంటూ క్లెయిమ్లు కూడా ఈ వీడియోతో ప్రసారం అవుతున్నాయి.
ఈ వీడియోలో కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇలా అన్నట్లు వినవచ్చు:
"ఈరోజు నా పార్లమెంట్లోనే రెండు సీట్లు కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సీట్లు కోల్పోవడానికి కూడా, ఈ పర్సెంటేజ్ ఎందుకు పోయింది అని కూడా ఆలోచించాలి, నేను చెప్తున్నా, ఏంటంటే, ఒకటి మా ముఖ్య మంత్రి పాలన."
ఈ వీడియోని ఫేస్బుక్లో షేర్ చేసి ఇలా రాసారు, "బ్రేకింగ్ న్యూస్.. మా ముఖ్యమంత్రి పాలన వల్లే నా నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీ సీట్లు కోల్పోయాం. ప్రభుత్వ పనితీరుపై స్వంత పార్టీ నేతల నుంచే తీవ్ర అసంతృప్తి. గ్రౌండ్ లెవెల్లో నాయకత్వం ఫెయిల్ అయ్యిందని ఆవేదన - ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి". (ఆర్కైవ్)
Fact Check
న్యూస్మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ప్రెస్ మీట్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాటలను వక్రీకరించేలా కట్, ఎడిట్ చేసి వైరల్ వీడియోని రూపొందించారు.
వైరల్ వీడియో కీఫ్రేమ్ల రివర్స్ ఇమేజ్ సెర్చ్లను ఉపయోగించి, ఫిబ్రవరి 18న V6 టీవీ న్యూస్ ద్వారా యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన వీడియోను కనుగొన్నాం. వీడియో శీర్షిక "లైవ్: MP చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ | V6 న్యూస్".
ఈ వీడియోలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడడం కనిపిస్తుంది.
ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎన్నికల గురించి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతోందని, ప్రజలు కాంగ్రెస్కు మరోసారి అవకాశం ఇస్తారని, తెలంగాణను ముందంజలో ఉంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఓటమికి అంతర్గత సమస్యలు, నాయకులు-కార్యకర్తల మధ్య గ్యాప్ కారణమని పేర్కొంటూ, వాటిపై సమీక్ష చేసి చర్యలు తీసుకుని భవిష్యత్ ఎన్నికల్లో మరింత బలంగా గెలుస్తామని తెలిపారు
వీడియోలోని 26:45 నిమిషాల మార్క్ వద్ద కాంగ్రెస్ ఎంపీ వైరల్ వీడియోలో చేసిన వ్యాఖ్యలనే చూడవచ్చు.
అయితే, మొత్తం సంభాషణను చూసిన తర్వాత, వైరల్ వీడియోను సందర్భం నుండి తొలగించి, ఉద్దేశపూర్వకంగానే రూపొందించారు అని స్పష్టంగా తెలుస్తుంది.
వైరల్ వీడియోలో ఉన్న వ్యాఖ్యలు చేసే ముందు, ఆ తరువాత కాంగ్రెస్ ఎంపీ ఇలా అన్నారు:
"నేను పని చేసినటువంటి నా సొంత పార్లమెంట్లోనే రెండు లక్షల పైచిల్లుకుతోటి నన్ను నా పార్లమెంట్లో గెలిపించారు ఆరోజు ప్రజల. ఈరోజు నా పార్లమెంట్లోనే రెండు సీట్లు కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సీట్లు కోల్పోవడానికి కూడా, ఈ పర్సెంటేజ్ ఎందుకు పోయింది అని కూడా ఆలోచించాలి, నేను చెప్తున్నా, ఏంటంటే, ఒకటి మా ముఖ్య మంత్రి పాలన. మా ముఖ్యమంత్రి ఆలోచన. ప్రజలు ఏ విధంగానైతే ఆదరిస్తున్నారో ప్రతి నాయకుడు కూడా ముఖ్యమంత్రి దారిలోనే నడవాలి. ప్రజలకు సేవ చేయాలన్న గుణం ఉండాలి. మా నాయకులకు కూడా ముఖ్యంగా కార్యకర్తలను ఎక్కడెక్కడైతే పట్టించుకోవట్లేదో, కార్యకర్తలను ఎక్కడైతే విస్మరిస్తున్నారో... ఈ కార్యకర్తలకు నాయకులకు గ్యాప్ వచ్చినప్పుడు ఆ నియోజక వర్గాలల్లో బిఆర్ఎస్ పార్టీ ఆ నాయకులను ఆపరేట్ చేసి, వాళ్ళకు ఉన్నటువంటి కోపాన్ని కన్వర్ట్ చేసుకునే ప్రయత్నంలోనే రెండు సీట్లు ఓడిపోయినాయి."
అధికారిక ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ సోషల్ మీడియా హ్యాండిల్ కూడా ఇదే వైరల్ క్లెయిమ్ గురించి పోస్ట్ చేసింది, ఇది తప్పుదారి పట్టించేది అని పేర్కొంది.
వాస్తవ పరిశీలన (FACT CHECK)ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి వీడియోపై తప్పుదారి పట్టించే ప్రచారం━━━━━━━━━━━━━━━━━━━━భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్కు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ను, ఆయన వ్యాఖ్యలను… pic.twitter.com/HtRIBAHJkJ
— FactCheck_Telangana (@FactCheck_TG) February 19, 2026
కాబట్టి వైరల్ క్లెయిమ్ తప్పు అని న్యూస్మీటర్ నిర్ధారించింది.