హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఒక ప్రెస్మీట్లో మాట్లాడుతూ, “దేశానికి ముస్లింలు, క్రిస్టియన్లు, సోషలిస్టులే శత్రువులు” అని అన్నట్లు ఓ షార్ట్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇన్స్టాగ్రామ్లో ఓ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకి “అంత చెడ్డగుణమే ఉండదు అనడానికి ప్రూఫ్.. దేశానికి పనికొచ్చే మాట చెప్పాడు.. నేను విన్న ఒకే ఒక్క మంచి మాట ఈయన నోటి నుంచి” అనే క్యాప్షన్ పెట్టాడు.(Archive)
ఫ్యాక్ట్ చెక్
న్యూస్మీటర్ పరిశీలనలో ఈ వీడియో తప్పుదోవ పట్టించేది అని తేలింది. వైరల్ అవుతున్న క్లిప్ పూర్తి ప్రెస్మీట్లో భాగం మాత్రమే. ఉండవల్లి గోల్వాల్కర్ రచించిన 'బంచ్ ఆఫ్ థాట్స్' అనే పుస్తకాన్ని ప్రస్తావిస్తూ, ఆలోచనా విధానాన్ని విమర్శిస్తూ మాట్లాడారు. ఆయన స్వయంగా ఆ అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు.
కీవర్డ్ సెర్చ్ ద్వారా మేము ఒక పూర్తి నిడివి గల TV5 న్యూస్ 2022 ఏప్రిల్ 15న ప్రెస్మీట్ వీడియోను “LIVE: Undavalli Arun Kumar Sensational Press Meet on Jagan Govt.” పేరుతో యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. అందులో 12:53 నిమిషాల సమయంలో ఉండవల్లి ఇలా అంటారు: “ఆ పుస్తకంలో గోల్వాల్కర్ పేర్కొన్నారు.. దేశానికి ముగ్గురు శత్రువులు ఉన్నారు - ముస్లింలు, క్రిస్టియన్లు, సోషలిస్టులు.”
ఈ మాటల ద్వారా ఆయన, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. దీనిపై మరో పత్రిక ది వైర్ 2024 అక్టోబర్ 15న ప్రచురించిన కథనంలో గోల్వాల్కర్ సిద్ధాంతాలపై ఇలా చెప్తుంది: “ఆర్ఎస్ఎస్ లక్ష్యం హిందువులను ఒకచోట చేర్చటం.. హిందువులను ముగ్గురు శాశ్వత శత్రువుల నుంచి కాపాడటం: ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులు.”
ఇది ఉండవల్లి ప్రస్తావించిన అంశానికి అనుగుణంగా ఉంటుంది.
ఈ వీడియో తప్పుడు వివరాలతో ప్రచారం అవుతోంది. ఉండవల్లి అరుణ్కుమార్ దేశ శత్రువులుగా ముస్లింలు, క్రిస్టియన్లు, సోషలిస్టులను పేర్కొనలేదు. ఆయన గోల్వాల్కర్ పుస్తకాన్ని ఉదహరిస్తూ ఆ భావజాలాన్ని విమర్శించారు. అసలు ప్రసంగాన్ని కత్తిరించి, దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ దావా మోసపూరితమైనదని నిరూపితమైంది.