Fact Check: రోహింగ్యాల బహిష్కరణ తర్వాత జవాన్ల డాన్సులు? కాదు, ఈ వీడియో 2022 గణపతి నిమజ్జనం నాటిది

అస్సాం నుండి బంగ్లాదేశ్‌కు రోహింగ్యాలను బహిష్కరించిన తర్వాత అక్కడి ప్రజలతో కలిసి డాన్సులు, సంబరాలు జరుపుకుంటున్న జవ్వాన్లను చూపిస్తోంద‌నే క్లెయిమ్‌లతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By K Sherly Sharon
Published on : 28 May 2025 8:20 PM IST

Fact Check: రోహింగ్యాల బహిష్కరణ తర్వాత జవాన్ల డాన్సులు? కాదు, ఈ వీడియో 2022 గణపతి నిమజ్జనం నాటిది
Claim:అస్సాంలోని సుతార్కండి నుండి బంగ్లాదేశ్‌కు రోహింగ్యాల బహిష్కరణ తర్వాత ప్రజలతో కలిసి డాన్సులు చేసిన జవాన్లు.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. యూనిఫాంలో ఉన్న పోలీసులు, సైనికులను 2022 లో గణపతి నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్నప్పటి వీడియో.

Hyderabad: అస్సాంలో ఉంటున్న రోహింగ్యాలను బంగ్లాదేశ్‌కు తరిమిన తర్వాత ప్రజలతో కలిసి జవాన్లు సంబరాలు చేసుకుంటున్నారు అన్న ఆరోపణలతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో యూనిఫాం ధరించిన సైనికులు, పోలీసు సిబ్బంది పౌరులతో కలిసి భారీ గుంపులో సంబరాల్లో పాల్గొన్నట్లు చూడగలం.

ఈ వీడియోపై "అస్సాం లో సూత్రకండి గ్రామంలోని రోహింగ్యాలందరిని… తరమడంతో ప్రజలతో కలిసి జవాన్లు సంబరాలు" అని రాసి ఉంది. క్యాప్షన్‌లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఫేస్‌బుక్‌లో ఈ వీడియోని పంచుకున్నారు. (ఆర్కైవ్)

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఇది మహారాష్ట్రలో గణపతి నిమజ్జనం ఊరేగింపులో యూనిఫామ్ ధరించిన పోలీసులు, సైనికులు ప్రజలతో కలిసి నాట్యం చేయడం చూపిస్తున్న వీడియో.

మే 12న డెక్కన్ హెరాల్డ్ "పాకిస్తాన్‌తో సైనిక వివాదం మధ్య భారతదేశం కనీసం 142 మంది రోహింగ్యాలను బంగ్లాదేశ్, మయన్మార్‌కు బహిష్కరించింది" అనే శీర్షికతో ఒక నివేదికను ప్రచురించింది.

పాకిస్తాన్‌తో సైనిక వివాదం మధ్య, భారతదేశం రోహింగ్యాలను తిరిగి బహిష్కరించిందని మే 7 మొదలు అస్సాం, న్యూఢిల్లీ నుండి కనీసం 142 మంది "శరణార్థులను" బంగ్లాదేశ్, మయన్మార్‌కు పంపిందని ఈ నివేదిక పేర్కొంది.

ఈ వార్త మినహా ఇటీవలి కాలంలో అస్సాంలోని సుతార్కండి నుండి రోహింగ్యాలను బహిష్కరించినట్లు పేర్కొన్న ఏ వార్తా నివేదిక మాకు దొరకలేదు.

వైరల్ వీడియో కీ ఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 'జై శ్రీ రామ్' అనే క్యాప్షన్‌లో 'ఇండియన్ మిలిటరీ అప్‌డేట్స్ - IMU' అనే ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేసిన వైరల్ వీడియో దొరికింది. ఈ పోస్ట్ మార్చ్ 30, 2023లో పోస్ట్ చేయబడింది.

Jai Shree Ram.

Posted by Indian Military Updates - IMU on Thursday, March 30, 2023

"మహారాష్ట్ర ప్రభుత్వం @mieknathshinde @Dev_Fadnavis... జహాన్ బచ్చా బచ్చా జై శ్రీరామ్ బోలెగా... ఇదే హిందూత్వ ప్రభుత్వం," అనే క్యాప్షన్‌లో వైరల్ వీడియోలో ఉన్న ఘటనను వేరే కోణంలో చూపిస్తున్న వీడియో ఒకటి దొరికింది. ఈ పోస్టు సెప్టెంబర్ 11, 2022న చేయబడింది.

"కొల్హాపూర్ పోలీస్ డ్యాన్స్: గణపతి నిమజ్జనం సందర్భంగా కొల్హాపూర్ పోలీసుల అద్భుతమైన డాన్స్, వీడియో వైరల్" అనే శీర్షికతో సెప్టెంబర్ 10, 2022లో నవభారత్ టైమ్స్ ప్రచురించిన కథనం దొరికింది. ఈ కథనంలో వైరల్ వీడియో నుండి స్క్రీన్‌షాట్ ఉపయోగించారు.

కరోనా మూలంగా నిలిచిపోయిన గణపతి నిమజ్జనం వేడుకలు రెండు సంవత్సరాల తర్వాత పునఃప్రారంభం అయినందున అందరు కలిసి రోడ్డు మీద డాన్స్ చేస్తున్నారు అని ఈ కథనంలో పేర్కొన్నారు. కొల్హాపూర్ నుండి మొదలన ఊరేగింపులో పోలీసులు కూడా పాల్గొన్నారని రాశారు.

ఈ వీడియో, ఇంకా పోలీసులు డాన్స్ చేస్తున్న మరిన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, మహారాష్ట్ర పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADG) లా అండ్ ఆర్డర్, కుల్వంత్ సారంగల్, యూనిఫాంలో ఉన్న ఏ పోలీసు కూడా నృత్యం చేయకూడదని, లేకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వైరల్ వీడియోలో ఉన్నది 2022లో గణపతి నిమజ్జనం సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న కొల్హాపూర్ పోలీసులు అని తేలింది. ఈ వీడియోకి అస్సాం నుండి రోహింగ్యాలు బహిష్కరించడానికి ఏ సంబంధం లేదు.

కాబట్టి, న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది.

Claim Review:అస్సాంలోని సుతార్కండి నుండి బంగ్లాదేశ్‌కు రోహింగ్యాల బహిష్కరణ తర్వాత ప్రజలతో కలిసి డాన్సులు చేసిన జవాన్లు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. యూనిఫాంలో ఉన్న పోలీసులు, సైనికులను 2022 లో గణపతి నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్నప్పటి వీడియో.
Next Story