Fact Check: కోటప్పకొండలో మహాశివరాత్రి సందర్భంగా ప్రభలు కాలిపోయాయా? కాదు… అసలు నిజాలు ఇవే

మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో ప్రభలు తగలబడినట్టు చూపిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By -  M Ramesh Naik
Published on : 16 Feb 2026 4:42 PM IST

A video claiming to show prabhalu catching fire at Kotappakonda during Maha Shivaratri celebrations is circulating on social media.
Claim:తాజా మహాశివరాత్రి వేడుకల్లో కోటప్పకొండలో ప్రభలు తగలబడ్డాయని వీడియో చూపిస్తోంది.
Fact:ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టించేది. వైరల్ వీడియో 2014 నాటిది; ఇటీవలి మహాశివరాత్రి వేడుకలకు సంబంధం లేదు.

Hyderabad: ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరి 15, 2026న మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలను సందర్శించగా, ముఖ్యంగా త్రికోటేశ్వర స్వామి దేవస్థానం వద్ద విశేష రద్దీ కనిపించింది. కోటప్పకొండపైకి ప్రభలను తీసుకెళ్లే సంప్రదాయ ఊరేగింపుల్లో భక్తులు పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో ప్రభలు కాలిపోయినట్టు చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలి మహాశివరాత్రి వేడుకల్లోనే ఈ ఘటన జరిగిందని కొందరు పోస్టులు ప్రచారం చేస్తున్నాయి.

ఒక X యూజర్ వీడియోని షేర్ చేస్తూ, “ ప్రసాదాలు కల్తీ చేసి మళ్ళీ ఏమి తెలియనట్టు ప్రభలు కట్టడం శివయ్యకు కూడా నచ్చనట్టుంది” అని క్యాప్షన్ రాశాడు. (Archive)

మరొక X యూజర్, “ధర్మం మంటగలిస్తే... ఆ త్రికూటేశ్వరుడు కన్నెర్ర చేయడా?” అంటూ షేర్ చేశాడు. (Archive)

Fact Check

న్యూస్‌మీటర్ పరిశీలనలో ఈ వైరల్ క్లెయిమ్ తప్పుదారి పట్టించేదని తేలింది. ఈ వీడియో తాజా మహాశివరాత్రి వేడుకలకు సంబంధించినది కాదు.

వీడియో అసలు నేపథ్యం ఏమిటి?

వైరల్ వీడియో నుంచి కీ ఫ్రేమ్స్ తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 2014 మార్చి 1న యూట్యూబ్ లో అప్‌లోడ్ చేసిన వీడియో కనిపించింది. “Kotappa kondalo lighting prabha short circuit in 27-02-2014” అనే శీర్షికతో ఉన్న ఆ వీడియోలో కనిపించే దృశ్యాలు వైరల్ క్లిప్‌తో పూర్తిగా సరిపోతున్నాయి. అంటే ఇది 2014 మహాశివరాత్రి సందర్భంగా జరిగిన షార్ట్ సర్క్యూట్ ఘటనకు చెందిన పాత వీడియో.

పోలీసుల వివరణ

ఇదే విషయంపై పల్నాడు జిల్లా పోలీసు స్పష్టత ఇచ్చారు. ఇటీవల కోటప్పకొండలో ప్రభలు తగలబడిన ఘటన ఏదీ జరగలేదని అధికారులు తెలిపారు. కొంతమంది కావాలనే పాత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అపోహలు సృష్టిస్తున్నారని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

కోటప్పకొండలో ఇటీవలి మహాశివరాత్రి సందర్భంగా ప్రభలు కాలిపోయినట్టు వైరల్ అవుతున్న వీడియో పాతది. అది 2014 ఘటనకు సంబంధించినదే. కాబట్టి వైరల్ క్లెయిమ్ తప్పుదారి పట్టించేదిగా తేలింది.

Claimed By:Social media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టించేది. వైరల్ వీడియో 2014 నాటిది; ఇటీవలి మహాశివరాత్రి వేడుకలకు సంబంధం లేదు.
Next Story