Fact Check: కుంభమేళా వెళ్తున్న రైలుపై రాళ్లు రువ్విన వారినీ పోలీసులు అరెస్టు చేశారా? నిజం ఇక్కడ తెలుసుకోండి

పశ్చిమ బంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో భూ వివాదానికి సంబంధించి పోలీసులు, స్థానికుల మధ్య జరిగిన ఘర్షణ వీడియోను కుంభమేళాతో లింక్ చేస్తూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

By M Ramesh Naik  Published on  4 Feb 2025 6:51 PM IST
A video of police beating a man has been circulating on social media with the claim that he was accused of pelting stones at a train heading to the Kumbh Mela.
Claim: వైరల్ వీడియోలో పోలీసులు కుంభమేళా వెళ్తున్న రైలుపై రాళ్లు రువ్విన వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
Fact: ఈ వీడియో పశ్చిమ బంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో జరిగిన సంఘటనకు సంబంధించినది.

హైదరాబాద్: ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకుని వాహనంలోకి తోసివేస్తున్న దృశ్యాలు చూడవచ్చు. ఐతే ఈ వీడియోను కుంభమేళా వెళ్తున్న ట్రెయిన్‌పై రాళ్లు రువ్విన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు చెప్పి షేర్ చేస్తున్నారు.

ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, "కుంభమేళా వెళ్లే దారిలో ట్రెయిన్ పై రాళ్లు రువ్విన పందులకు ట్రీట్మెంట్... యోగినా మజాకా..." అని క్యాప్షన్ ఇచ్చాడు.

ఇలాంటి పోస్ట్‌ ఇక్కడ చూడొచ్చు. (Archive)

ఫ్యాక్ట్ చెక్:

న్యూస్‌మీటర్ ఈ వీడియోను పరిశీలించి, ఈ క్లెయిమ్ తప్పని నిర్ధారించింది. ఈ ఘటన పశ్చిమ బంగాల్‌లో జరిగింది, కుంభమేళాతో ఎలాంటి సంబంధం లేదు.

మేము వీడియోలోని ఒక కీ ఫ్రమేను రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించిగా, మాకు 2025 జనవరి 28న ఆసియానెట్ న్యూస్ బంగ్లా ప్రచురించిన ఒక కథనం లభించింది. "సూరి పోలీస్: పోలీస్ యూనిఫాంపై చేతులు! బిర్భూమ్‌లో తృణమూల్ కార్యకర్తను పోలీసులు కఠినంగా శిక్షించారు." (బెంగాలీ నుండి తెలుగు అనువాదం) అనే శీర్షికతో వచ్చిన ఈ కథనంలో ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ఉంది.

ఈ కథనం ప్రకారం, బీర్భూమ్ జిల్లాలోని సూరి నగరంలో భూ వివాదం కారణంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణను నియంత్రించేందుకు వెళ్లిన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను ఓ కార్యకర్త కాలర్ పట్టుకుని లాగాడు. పోలీస్ అధికారిని అవమానించిన ఘటన తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా కీవర్డ్ సెర్చ్ ద్వారా 2025 జనవరి 29న ప్రచురితమైన ది టెలిగ్రాఫ్ కథనం కూడా ఈ సంఘటనను ధృవీకరించింది. ఈ కథనంలోనూ భూ వివాదం నేపథ్యంలో తృణమూల్ వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, పోలీస్ అధికారి దాడికి గురయ్యాడని పేర్కొన్నారు.

అదనంగా, ABP ఆనంద 2025 జనవరి 28న విడుదల చేసిన ఒక యూట్యూబ్ వీడియోలో ఈ ఘర్షణ గురించి మరింత సమాచారం ఉంది.

ఈ వీడియో వివరణలో పోలీసులు ఘర్షణను నియంత్రించేందుకు లాఠీచార్జ్ చేసినట్లు పేర్కొన్నారు. ఒక వ్యక్తిని తుపాకీతో సహా అరెస్ట్ చేసినట్లు కూడా వెల్లడించారు.

కాబట్టి, ఈ వైరల్ వీడియో కుంభమేళాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. ట్రెయిన్‌పై రాళ్లు రువ్వడంపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు చేస్తున్న దావా అసత్యం.

Claim Review:వైరల్ వీడియోలో పోలీసులు కుంభమేళా వెళ్తున్న రైలుపై రాళ్లు రువ్విన వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook, X
Claim Fact Check:False
Fact:ఈ వీడియో పశ్చిమ బంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో జరిగిన సంఘటనకు సంబంధించినది.
Next Story