Hyderabad: కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ 2025 ఫిబ్రవరి 27న జరగనుంది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి. అంజి రెడ్డిని ఎంపిక చేశారు.
ఈ నేపథ్యంలో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డిని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాస్ వార్నింగ్ ఇచ్చారని క్లెయిమ్ చేస్తున్న ఓ న్యూస్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ న్యూస్ క్లిప్పింగ్ "టికెట్ పుణ్యానికి ఇవ్వలేదు… 30 కోట్లిచ్చా...!" అనే శీర్షికతో కనిపించింది. భాజపా కార్యకర్తలు తన కోసం ప్రచారం చేయకపోయినా సరే, ఓటుకు రెండు వేలు పంచైనా గెలుస్తా అని అంజిరెడ్డి అన్నట్లు ఈ న్యూస్ క్లిప్పింగ్ చూపిస్తుంది.
న్యూస్ క్లిప్పింగ్ "ఎవరెవరు ప్రచారం చేయడం లేదో లిస్టు రాసుకుంటున్న పోలింగ్ అయ్యాక ఒకొక్కడి తోలు తీస్తా. కిషన్ రెడ్డి, సంజయ్, లక్ష్మణ్ కు 30 కోట్లు సింగిల్ పేమెంట్ చేసి టికెట్ తెచ్చుకున్న... బిజెపి నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాస్ వార్నింగ్" అని పలు ఆరోపణలు చేస్తోంది.
న్యూస్ క్లిప్పింగ్ పై తెలంగాణ న్యూస్ టుడే లోగో, లింక్ ఉన్నాయి. ఈ వార్త క్లిప్పింగ్ ఫేస్బుక్లో "ఇంత డైరెక్టె గా, పబ్లిక్ గా చెబుతున్నాడు అయినా కూడా ఎక్కడ స్పందించని ED, IT, CBI, EC వ్యవస్థలు... అసలు భారత దేశం లో రాజ్యాంగం వుందా వుంటే అమలువుతుందా," అనే క్యాప్షన్తో షేర్ చేశారు. (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్టును ఇక్కడ చూడవచ్చు.(ఆర్కైవ్)
Fact Check
ఈ వాదన తప్పు అని న్యూస్మీటర్ కనుగొంది. ఈ వార్తా సంస్థ ఉనికిలో లేదు.
భాజపా అభ్యర్థి ఎమ్మెల్సీ టికెట్ కొనుక్కున్నట్టు చూపిస్తున్న వార్త కథనాలు, సోషల్ మీడియా పోస్టులు ఏవి మాకు దొరకలేదు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన వార్నింగ్ ఇచ్చారని చూపిస్తున్న విశ్వసనీయ సమాచారం కూడా దొరకలేదు.
అంజిరెడ్డి వైరల్ అవుతున్న ఈ న్యూస్ క్లిప్పింగ్ పై స్పందిస్తూ… తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంగా ఈ న్యూస్ క్లిప్పింగ్ని ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. "చేసిన సేవ, నమ్మిన సిద్ధాంతమే బలంగా బరిలోకి దిగినోడిని… న్యాయంగా ఎదుర్కోలేక ఫేక్ న్యూస్ తో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి" అని పోస్టులో అన్నారు.
న్యూస్మీటర్ అంజిరెడ్డి బృందంతో మాట్లాడింది. వారు వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తోసిపుచ్చారు. న్యూస్ క్లిప్పింగ్లో ఉపయోగించిన చిత్రం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ సమావేశంలో తీసినదిగా గుర్తించారు.
ఈ ఫోటోను అంజిరెడ్డి ఫేస్బుక్లో 2025 ఫిబ్రవరి 20న అప్లోడ్ చేశారు. "ఇవాళ కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో జరిగిన గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ @mpbbpatil గారు, కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీ నీలం చిన్న రాజులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు," అని క్యాప్షన్లో రాశారు.
ఈ వార్త సంస్థ గురించి గతంలో న్యూస్మీటర్ రాసింది. తెలంగాణ న్యూస్ టుడే అనే సంస్థ ప్రచురించింది అని చూపిస్తున్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్, అసలు ఆ సంస్థ ఉనికిలోనే లేదని తేలింది.
న్యూస్ క్లిప్పింగ్ బ్యానర్పై ఉన్న లింక్ మనుగడలో లేదు. గూగుల్, బింగ్లో వివిధ కీవర్డ్ శోధనలు నిర్వహించి, తెలంగాణ న్యూస్ టుడే డైలీ ఈ-పేపర్ లేదా దాని వెబ్సైట్ ఎక్కడా లేదని కనుగొన్నాం.
Whois ఉపయోగించి telangananewstodaydaily డొమైన్ ఇంకా నమోదు కాలేదని కూడా కనుగొన్నాం. భారతదేశ వార్తాపత్రికల రిజిస్ట్రార్ కార్యాలయ వెబ్సైట్లో 'తెలంగాణ న్యూస్ టుడే', 'తెలంగాణ న్యూస్ టుడే డైలీ' అనే పేరుతో రిజిస్టర్ అయిన వార్త సంస్థల కోసం శోధించాము. ఈ శీర్షికలతో ఏ వార్త సంస్థ కూడా నమోదు కాలేదని కనుగొన్నాం.
ఈ వార్తా సంస్థ, అది ప్రచురిస్తున్నట్లు చూపిస్తున్న వార్తలు రెండూ ఉనికిలో లేవు. తెలంగాణ న్యూస్ టుడే డైలీ సంస్థ... న్యూస్ క్లిప్పింగ్ల ద్వారా వస్తున్న అన్ని క్లెయిమ్స్ బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, వాటిని వైరల్ చేయడానికే ఉపయోగించబడుతున్నట్లు కనిపిస్తోంది.
కాబట్టి న్యూస్మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది.